నీడగా సాగాలన్న చోట.. గోడగానే మారాలి.. శలభానివి కావల్సిన చోట.. ప్రమిదగానే వెలగాలి.. ప్రేమాలింగనాల కొలిమిలో.. అభిమానం అడుసుగా మారుతుంది.. కోరికల జిగినీ పరదాల మాటున.. నగిషీలు చెక్కిన గాయం.. కాష్మోరా లా నిద్ర లేస్తుంది స్రవించే పుండుని ముట్టుకోనేలేరు.. కిలికించితాల అలల మీద.. అహంకృత గరళ వస్త్రం కప్పుకుంటుంది.. ఇప్పుడు కొత్తగా ఏంటి?.. హృదయ పరిఛ్ఛేదన.. యుగాల నాటిది.. ఏ అభిజాత్యపు క్షణమో.. నిన్ను నిన్నుగానే చూడాలనుకొంటుంది.. ఒక్కొక్క సారి.. సన్యాసపు సహజీవనాలు.. ఎంత మధురంగా వుంటాయి!.. నిన్ను నువ్వు గెల్చుకున్న ప్రతి క్షణం.. ఒక మూలరాయి అవుతుంది.. పెను గాలికి కూలిన మాను ...... మనసు చచ్చిన మానవి! తేడా ఏముందని? దు:ఖపు మూలాల్ని వేరు పురుగు తొలుస్తూనే వుంది.. కీటక నాశని చల్లండి.. గుండె గాయం.. ఇంకా ఆరనే లేదు ! -పుట్ల హేమలత

Tuesday, January 20, 2009

అసలు సంక్రాంతి

ఆ మధ్య మాకు తెలిసినావిడ బజార్లో కలిస్తే' సంక్రాంతి పనులు పూర్తి అయ్యాయా?ఎప్పుడూ అట్టహాసంగా చేస్తారు కదా!మీ ఆడ బడుచు ఎలా వుందీ?అప్పుడెప్పుడో ఆర్ధికంగా బాగా చితికి పోయారు అన్నారు కదా?' అనడిగాను.
'అదెందుకు అడుగుతారులెండి.ఆ భారమంతా ఇప్పుడు నా నెత్తికొచ్చి పడింది.ఇదిగో వారం ముందే పిల్లా జెల్లా తో వచ్చి నా మీద వాలి పోయారు.మాతో బాటూ సమానంగా అన్నీ సమకూర్చొద్దా?మా వారు దగ్గరుండి మరీ తీసుకొ్చ్చారు.చేసే వాళ్ళకి తెలుస్తుంది ' అంది నిష్టూరంగా.
నిజానికి ఆమెకి డబ్బుకి తక్కువ లేదు.ఆమె ఆడబడుచు ఆమెకి పరాయిదీ కాదు.పని సంగతా?ఇంటి నిండా పని వాళ్ళు.......
'దేనికైనా మనసుండాలి కదా?' అనుకుంటూ ఇంటికొచ్చాను.
సంక్రాంతి రోజు అనుకోకుండా ఆన్ లైన్ లో ఒక అమెరికా స్నేహితురాలితో మాట్లాడాను.'సంక్రాంతి శుభాకాంక్షలు ! ఎలా జరుపుకున్నారు పండుగ ?' అని అడిగాను.
అవీ ఇవీ మాట్లాడుకున్నాక ఆమె ఇలా చెప్పింది.
'ఏముంది?ఒక పేద వృద్దురాలికి కొంత ఆర్దిక సాయం చేసాను.ఇండియా లోని ఒక ధార్మిక సంస్థ కి అయిదువేల రూపాయలు పంపాను.ఈ తృప్తి చాలదా ఈ సంక్రాంతికి ?"అంది .
'అబ్బ ఎంత గొప్ప పండగ! దేనికైనా మనసుండాలి .'అనుకున్నాను మళ్ళీ.

-హేమలత పుట్ల

Thursday, January 8, 2009

స్మృత్యంజలి

స్మైల్' ...ఖాళీ సీసాలు మృత్యు మధువుతో నింపి ఆకాశ చషకం లో ఆఖరి 'చుక్క'య్యాడు. జ్వాలాముఖి 'జై దిగంబరా నేనే పైగంబరా' అని నినాదాలిచ్చుకుంటూ తనకు తానే జోహార్లర్పిం చుకున్నాడు .
మన 'స్వస్థాన మిత్రుడు' కొత్తపల్లి అక్షరాల అంతరిక్షాల్లోకి వెలుతురుపిట్టలా ఎగిరి పోయాడు.
తెలుగిస్లాం పండితుడు... జనాబ్ ఖాద్రి .అల్లా కు ప్యారే అయ్యాడు.ఆయన స్థాయి గీటు రాయి .
తెలుగు సాహిత్యం లో నిలువెత్తు దివిటీలైన ఈ కళా మూర్తుల కాంతి కనుమరుగయింది.ఈ వెలితిని పూర్తి చెయ్యటానికి ఎన్ని కాంతి సంవత్సరాలు కావాలో !?
అయినా మృతియె లేకున్న రుచి యేది బ్రతుకులోన?!
పుట్ల హేమలత